Thursday, 23 May 2013 06:18
అరటిపువ్వు పులుసు కూర
కావలసిన పదార్థాలు :
అరటిపువ్వు - పెద్దది, చింతపండు - 50గ్రా,
ఉల్లిపాయలు - 4 పెద్దవి, పచ్చి మిరపకాయలు - 6, తాలింపు సామాన్లు - రెండుచెంచాలు, ఇంగువ - చిటికెడు ఆవకోసం :
ఆవాలు - చెంచా, ఎండు మిరపకాయలు - 2
తెల్ల నువ్వుల పప్పు - 3 చెంచాలు, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు.
తయారీ విధానం :
అరటిపువ్వును ఒలిచి పువ్వులో రేకులను (వీటిని దొంగలు అని అంటారు. మొగ్గల్లా ఉంటాయి) తొలగించి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న పువ్వులన్నింటిని రోటిలో గాని మిక్సిలో గాని వేసి కచ్చా, పచ్చాగా దంపుకుని జల్లెడలో వేసి నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పువ్వుకున్న వగరు పోతుంది. తరువాత ఓ బాణలిలో నూనె పోసి ఇంగువ, తాలింపు సామాన్లు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమి్చి ముక్కలు వేసి వేగిన తరువాత దంపుకున్న అరటిపువ్వును కూడా చేర్చి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. అరటిపువ్వు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిసికి పోయాలి. పులుసు బాగా అరటిపువ్వుకి పట్టి నీరు ఇగిరేవరకు ఉడికించాలి. దీంతో కూర తయారవుతుంది. తరువాత ఆవాలు, నువ్వుల పప్పు, రెండు ఎండుమిర్చి, ఉప్పు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి పోపు ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన అరటిపువ్వు కూరకి కొద్దిగా నూనె వేసి కలపాలి. అంతే కమ్మని పులుసుతో అరటిపువ్వు కూర రెడీ అవుతుంది.
- జి. శైలజ, జంగారెడ్డి గూడెం, పశ్చిమ గోదావరి
అరటికాయ కోఫ్తా కర్రీ
కావలసిన పదార్థాలు :
అరటికాయలు - 4, ఉల్లిపాయలు - 3, టమోటాలు - పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 చెంచాలు, పచ్చిమిరపకాయలు - 6, కొత్తిమీర - కట్ట, మిరియాల పొడి - అర చెంచా, పెరుగు - కప్పు, ధనియాల పొడి - చెంచా, జీడిపప్పు - 50గ్రా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడ, పసుపు - చిటికెడు, కారం - రెండు చెంచాలు, కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట, గరం మసాల - అరచెంచా, కొబ్బరి పొడి - చెంచా.
తయారీ విధానం :
అరటికాయలను ఉడికించి పై చెక్కు తీసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేగాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం వేయించి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమంలో జీడిపప్పు పేస్టును కూడా వేసి కలపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నూనె పోసి పోపు వేసుకుని అందులో రుబ్బిన ఉల్లిపాయ, టమోట ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు , గరం మసాల, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పెరుగు జీడిపప్పు పేస్టు కొంచెం వేసుకుని ఉడికించాలి. కొంచెం ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న అరటి కోఫ్తా బాల్స్ని అందులో వేసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.
- డి. మాధవి, మడికొండ, వరంగల్
క్యారెట్ -65
కావలసిన పదార్థాలు :
క్యారెట్ - 250గ్రా.,
మైదా - 50గ్రా., శనగపిండి - 50గ్రా., అల్లం వెల్లుల్లి - చెంచా, ఉప్పు - తగినంత, పెరుగు - కప్పు, పచ్చిమిరపకాయలు - 20గ్రా., కరివేపాకు - కట్ట
నూనె - వేయించడానికి సరిపడా, కారం - చెంచా, ఆరెంజ్ కలర్ - అర చెంచా.
తయారీ విధానం :
ం క్యారెట్ను శుభ్రం చేసి గుండ్రంగా చిన్న చిన్న చక్రాల్లా కోసుకోవాలి.
ం ఒక గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, ఆరెంజ్ కలర్ను కలిపి బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
ం ఈ పిండిలో క్యారెట్ ముక్కలను ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి.
ం ఇంకో బాణలిలో కొద్దిగా నూనె పోసి నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేయించండి. ఇందులో వేయించిన క్యారెట్ ముక్కలు కలిపి మరో మూడు నిమిషాలు ఫ్రైచేయాలి.అంతే 'క్యారెట్ - 65' రెడీ.
- బి. మాధవి, రాజేశ్వరీ కాన్వెంటు దగ్గర, చాగల్లు, పశ్చిమగోదావరి జిల్లా
రాజస్థానీ సాంగో ఆలు
కావలసిన పదార్థాలు :
బంగాళ దుంప - 1, పెరుగు - 100గ్రా., సగ్గుబియ్యం - 50గ్రా., జీడిపప్పు పేస్ట్ - 25గ్రా., ఉల్లి ముద్ద - 10గ్రా., అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, పచ్చిమిర్చి - 5(పేస్ట్ చేసుకోవాలి), దాల్చిన చెక్క - కొద్దిగా, జీలకర్ర - అర చెంచా, పసుపు - పావు స్పూను, ధనియాల పొడి - అరచెంచా, గరం మసాలా - అర చెంచా, కారం పొడి - అర చెంచా, ఉప్పు - తగినంత, నిమ్మరసం - రెండు చెంచాలు, నెయ్యి - 25గ్రా., ఎండు మిరపకాయలు - 2, కొత్తిమీర తురుము - చెంచా, పుదీనా తురుము - చెంచా, పచ్చి బఠానీ - అర కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు నీరు - తగినంత, నూనె - తగినంత.
తయారీ విధానం :
బంగాళదుంప పై పొర తీసేసి కొద్దిసేపు నీళ్లలో ఉడికించాలి. తరువాత నూనెలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడో బాణలిలో నెయ్యివేసి కాగిన తరువాత జీలకర్ర, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంవెల్లులి, పచ్చికొబ్బరి, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిబఠాని, మిర్చిపొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలను వేసి సన్నని సెగపై రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం జీడిపప్పు ముద్ద, పెరుగును అందులో వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత బంగాళదుంప వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాక గ్లాసు నీళ్లు పోసి నిమ్మరసం వేసి సరిపడా ఉప్పుకూడా వేసుకోవాలి. దీంతో రాజస్థానీ సాంగో ఆలు తయారైనట్టే. పైన కొత్తిమీర, పుదీనా తురుము చల్లుకుంటే ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా సువాసన వెదజల్లుతూ రుచిగా ఉంటుంది. పరోటా, రోటీ, పలావు, అన్నంతో కలిపి వేడివేడిగా తింటే మంచి రుచిగా ఉంటుంది.
- కె. శ్రీమాధవి, సాయినగర్, పొన్నూరు, గుంటూరు జిల్లా
కదంబ కూటు
కావలసిన పదార్థాలు : కాయగూరలు :
వంకాయలు - 50గ్రా,
అరటికాయ - 1,
బూడిద గుమ్మడి - 1 ముక్క,
గోరు చిక్కుడు - 50గ్రా,
బెంగళూరు వంకాయ - 1,
కందగడ్డ - 10గ్రా., కాకరకాయ - 1.
ఇతర వస్తువులు :
కందిపప్పు - 200గ్రా., శెనగపప్పు - 100గ్రా
మినప్పప్పు - 25గ్రా., ధనియాలు - 30 గ్రా., నూనె - రెండు చెంచాలు, పచ్చి బఠాని - 100గ్రా., ఇంగువ - చిటెకెడు, ఉప్పు - తగినంత, చింతపండు - 20గ్రా., పసుపు - చిటికెడు, ఎండు మిరపకాయలు - 5 గ్రా., పచ్చికొబ్బరి - అరకప్పు, కరివేపాకు - కొద్దిగా.
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో గ్లాసు కందిపప్పు, అరగ్లాసు శనగపప్పు విడిగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లుపోసి ఉంచాలి. దానిపై మరో గిన్నెలో పచ్చిబఠాని తగినన్ని నీళ్లుపోసి పెట్టి ఉడికించాలి. కూరగాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరో గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడి కించి పెట్టుకోవాలి. తరువాత ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత మిరపకాయలు, ధనియాలు, శెనగపప్పు, మినప్పుప్పు, ఇంగువ వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండును నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టిన వాటితో పాటు పచ్చికొబ్బరి తురమును మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద గిన్నె తీసుకుని ఉడికించిన పప్పులు, బఠాని, కాయగూరలను వేసి నాన పెట్టుకున్న చింతపండునుంచి గుజ్జును పిండి తగినంత ఉప్పు, పసుపు వేసి సన్నని మంటపై అడుగు అంటకుండా ఉడికించాలి. తరువాత అందులో నూరి పెట్టుకున్న మసాలను కలిపి గట్టి పడేంత వరకు ఉంచి దించేయాలి. మళ్లీ బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు చిట్లగానే స్టౌ ఆర్పేసి కరివేపాకు వేసి వండి ఉంచిన 'కూటు'లో కలపాలి. అంతే 'కదంబకూటు' రెడీ అయినట్టే. వేడివేడి అన్నంలో నెయ్యితో దీనిని కలుపుకుని తింటే 'యమా టేస్టీ'గా ఉంటుంది. దీనిని ఇంకా దోసె, ఇడ్లీ, చపాతీలతో కూడా తినవచ్చు.
- వి. చంద్ర, ఎటపాక, భద్రాచలం, ఖమ్మం జిల్లా.
గోబీరాజ్ వాడి
కావలసిన పదార్థాలు :
శెనగపిండి - కప్పు
పెరుగు - 2 కప్పులు
జీలకర్ర - అర చెంచా
గరం మసాలా - చిటికెడు
కారం - చెంచా
ఉప్పు - తగినంత
నెయ్యి - 4 చెంచాలు
తయారీ విధానం :
శెనగపిండిలో తగినంత పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరికి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో నెయ్యి పోసి జీలకర్ర, ధనియాలు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, పెరగు వేసి కలపాలి. చిక్కదనం కోసం రెండు చెంచాల శనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి, దానిని పెరుగు మిశ్రమానికి కలపాలి. చివరగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే 'గోబీరాజ్ వాడి' రెడీ అయినట్టే!
- వూర విజయలక్ష్మి, కనుపర్తి, ప్రకాశం జిల్లా
బచ్చలి - నువ్వుల కూర
కావలసిన పదార్థాలు :
బచ్చలి కూర - 2 కట్టలు
పచ్చిమిర్చి - 5
నువ్వులు - 100గ్రా
శెనగపప్పు - 2 చెంచాలు
మినప్పప్పు - 2 చెంచాలు
ఆవాలు - పావు చెంచా
జీలకర్ర - పావు చెంచా
కరివేపాకు - రెండు రెబ్బలు
వెల్లుల్లి పాయలు - రెండు
వేరెసెనగ గుళ్లు - 50గ్రా
ఇంగువ - చిటికెడు
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా
నూనె - చిన్న కప్పు
ఎండు మిర్చి - 6
చింతపండు రసం - సరిపడా
కారం - చెంచా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా బచ్చలి కూరను కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కోసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నూనె వేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగగుళ్లు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ వేసి మరికొంచెం సేపు వేయించాలి. తరిగి పెట్టుకున్న బచ్చలి కూరని పోపులో వేసి కలిపి పసుపు, ఉప్పు వేసి ఒక గ్లాసు నీరు పోసి మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు నువ్వులను పొడిగా వేయించి చల్లారాక వెల్లుల్లి రెబ్బలు, నువ్వుల పప్పును గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉడుకుతున్న బచ్చలిలో కొద్దిగా చింతపండు రసం వేసి కలపాలి. తర్వాత అందులో నువ్వుల పొడి, కారం వేసి మరో పది నిమిషాలు ఉంచి దించెయ్యాలి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది అన్నం, చపాతీల్లోకి భలే బాగుంటుంది.
- ఎస్. వెంకటరత్నం, శంకవారి వీధి, మండపేట, తూర్పుగోదావరి జిల్లా
వెజిటబుల్ జాల్ ఫ్రైజి
కావలసిన పదార్థాలు :
క్యాబేజి - చిన్నది, బీన్స్ - 10, క్యారెట్ - 1, క్యాప్సికం - 1, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3.
గ్రైండ్ చేయడానికి : ఉల్లిపాయలు -2, వెల్లుల్లి - 6 రెబ్బలు, అల్లం - చెంచా
గ్రేవీ కోసం : నూనె - రెండు చెంచాలు, కారం - రెండు చెంచాలు, ధనియాల పొడి - చెంచా, జీలకర్ర పొడి - చెంచా, పసుపు - అరచెంచా, గరం మసాల - అర చెంచా, మీగడ - అర కప్పు, ఉప్పు, పంచదార - తగినంత, టమోట సాస్ - నాలుగు చెంచాలు.
తయారీ విధానం :
క్యాబేజీ, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్లను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. తరువాత ఓ పాత్రలో వీటిని ఉడకబెట్టి పక్కనపెట్టుకోవాలి. ఉల్పిపాయలు, పచ్చిమిర్చిలను కూడా సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే గ్రైండ్ చేయాల్సిన సామగ్రిని కూడా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో నూనె పోసి వేడెక్కిన తరువాత గ్రైండ్ చేసిన మసాలాను వేయించుకోవాలి. అందులో నూనె పైకి వచ్చినట్టు అనిపించగానే పొడుగ్గా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలను వేసి కొంచెం వేయించాలి. అనంతరం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, మీగడ, గరం మసాలా, ఉప్పు, పంచదార వేసి మళ్లీ కొంచెం సేపు వేగనివ్వాలి. చివరికి ఇందులో ఉడకబెట్టిన కూరగాయలు, టమోట సాస్ వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే జాల్ఫైజి రెడీ అయినట్టే. దీన్ని ప్లేటుల్లోకి చేర్చి గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే సరి.
- మధులత, లక్ష్మీ అపార్ట్మెంట్స్, బోధన్, నిజామాబాద్ జిల్లా
హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ
కావలసిన పదార్థాలు :
మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను నానబెట్టి మొలకలు చేయాలి. పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, వెల్లుల్లి, మెంతికూర, ఉప్పు, తులసి ఆకులు, పసుపును సరిగ్గా ఉపయోగించాలి.
తయారీ విధానం :
మొక్కలు వచ్చిన పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టిలి. తర్వాత పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, మెంతికూర, ఉప్పు, నీళ్లు పోసి పది నిమిషాలు ఉడకబెట్టి పేస్ట్ చేయాలి. తర్వాత పోపు వేసి అందులో తులసి ఆకులు, ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మొలకలను ఆ పేస్టులో వేసి కలపాలి. దీంతో హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయినట్టే. ఇది చపాతీ, పూరీల్లోకి భలే బావుంటుంది.
- కె. శాంతమ్మ, అమన్గల్, మహబూబ్నగర్ జిల్లా
తీపి కాకరకాయ కూర
కావలసిన పదార్థాలు :
కాకారకాయలు - కేజీ
ఉల్లిపాయలు - రెండు
నూనె - ఒక కప్పు
పచ్చిమిరపకాయల కారం - రెండు చెంచాలు
ఎండు కొబ్బరి - 3చెంచాలు
ఆవాలు, జీలకర్ర - చెంచా
పెరుగు - అర కప్పు
పాలు - అరకప్పు
పసుపు - చిటికెడు
పంచదార - చెంచా
తయారీ విధానం :
ముందుగా కాకరకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీరకర్ర వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తరువాత ఉల్లిపాయలను కూడ వే యాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత పచ్చిమిరపకాయల కారం వేసి, వేగాక అందులో పాలు, పెరుగు పోసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తరువాత ఎండు కొబ్బరి, పసుపు వేయాలి. కూర దగ్గరగా వచ్చాక చక్కెర వేస్తే 'తీపి కాకరకాయ కూర' రెడీ అయినట్టే! ఇది అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.
-హెచ్. శైలజ, హిందూపూర్
* గాజు పాత్రలు లేదా గ్లాసులు ఒకదానిలో మరొకటి ఇరుక్కుపోయినప్పుడు లోపలిదానిలో చల్లటి నీళ్లు పోసి రెండిటినీ కాస్త వేడి నీటిలో దింపాలి. వెంటనే ఊడి వస్తాయి.
* ఉల్లిపాయల దగ్గరగా ఉంచితే బంగాళదుంపలు త్వరగా చెడిపోతాయి.
* కేకులో కోడిగుడ్డు వాసన రాకుండా ఉండాలంటే కేకు మిశ్రమానికి ఒక చెంచా తేనె కలిపితేసరి.
* కొంచెం నీళ్లకు వెనిగర్ లేదా నిమ్మకాయ చెక్కను కలిపి మరిగించి ఆ నీళ్లతో రుద్దితే అల్యూమినియం పాత్రలు తెల్లగా మెరిసిపోతాయి.
* భారతదేశంలో ప్రచురితమైన మొదటి వంటల పుస్తకం 'ద షెఫ్'. అది కేవలం గోవా వంటకాల గురించేనని పొరబడుతుంటారుగానీ, ఆ పుస్తకం మంగుళూరు ప్రాంత రుచులను పరిచయం చేస్తుంది.