తల్లీబిడ్డల...పోషకాహారం
బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలల్లో ఉండే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలో ఉండవన్నది నగ్నసత్యం...
మన భారతీయుల్లో స్థూలకాయం, షుగర్ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంత చిన్న వయసులో ఉన్న వారికి కూడా చక్కెర వ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకూ స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. పుణెలోని కింగ్ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పటల్ డయాబెటీస్ యూనిట్ డయాబెటీస్ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే మన వాళ్ళలో చక్కెరవ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కానీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుష్ఠి లేకపోవడమే దీనికి కారణం.